9, జులై 2016, శనివారం

‘దివ్యాగ్ని’ హృదయజ్యోతి

అబ్దుల్ కలాం గారికి తెలుగువారి కవితా నివాళిగా మద్రాస్ విశ్వవిద్యాలయం 'ఒక విజేత ' అనే పుస్తకాన్ని ప్రచురించింది. అందిలో అచ్చైన నా కవిత... మీ కోసం...

‘దివ్యాగ్ని’ హృదయజ్యోతి 
-------------------------
భావరాజు పద్మిని – 1/9/15.

ఎగురుతున్న చిట్టి పక్షిరెక్కల్ని, 
ఆశగా చుసాయా చిన్నారి కళ్ళు.
తనూ రెక్కలు కట్టుకుఎగరాలని, 
గాలిలోకి ఎగిరాయి అతని కాళ్ళు.

అందనంత ఎత్తుకు ఎదగాలంటే,
పేదరికానికి ఎదురొడ్డి పోరాడాలి,
ఉక్కులాంటి సంకల్పబలం కావాలి,
కష్టాలనుంచి శక్తిని మధించాలి,
అణువణువునూ తపన దహించాలి,
స్వీయశిల్పిగా వ్యక్తిత్వం దిద్దుకోవాలి,
మంచినే చూసుకుంటూ సాగిపోవాలి,
హృదయంలో నిజాయితీ ఉండాలి.



లోకం రువ్విన రాళ్ళతో సోపానాలు కట్టి,
‘శక్తై’న వ్యక్తి’ముందు ఓటమే ఓడిపోయింది,
ఏరోస్పేస్ ఇంజనీర్ గా అతన్ని మార్చింది.
‘రోహిణి’, ‘అగ్ని’, ‘పృథ్వి’ క్షిపణులు తీర్చిన,
భరతమాతకు తొలి క్షిపణి అందించిన,
అణ్వస్త్ర రాజ్యాలతో అమ్మను కూర్చోబెట్టిన, 
‘మిస్సైల్ మాన్‘ గా అతనికి పేరు తెచ్చింది.
‘రాష్ట్రపతి’గా జాతి ఆయన్ను గౌరవించింది.
అట్టడుగు నుంచి ఆకాశం వరకూ ఎదిగినా,
పసి హృదయాన్ని పదిలంగా కాపాడుకున్నారు,
కులమతాల హద్దులుదాటిన భారతీయుడయ్యారు,
నిస్వార్దుడిగా ఉండాలనే బ్రహ్మచారయ్యారు,
నిరాడంబరతకు నిలువెత్తు దర్పణమయ్యారు,
అధ్యాపకుడినేనంటూ అందరికీ చేరువయ్యారు,
మనసుల్ని మలిచే స్వదేశీ స్వాప్నికుడయ్యారు,
సహచరుడిగా మెలిగే ఆదర్శనాయకుడయ్యారు,
ఇతరులలోని శక్తిని వెలికి తీసిన స్రష్టయ్యారు.

సుతిమెత్తని హృదయజనితమైన కళాదృష్టి,
వాడిగల మేధోజనితమైన వైజ్ఞానిక దృష్టి,
మానవీయదృక్పధంతో మెలిగిన పరమేష్టి,
ఆయన జీవితమే ఒక గొప్ప సందేశంగా, 
ఆయన జీవితమే ఒక మహా గ్రంధంగా,
అందించి, దేశంకోసం పాటుపడమని చెప్తూ,
ప్రజలమదిలోని నిరంతర చైతన్య స్రవంతి,
ఏ అమరాలోకానికో తరలి వెళ్ళారు.

ఒక్క గుండెలో దీపం వెలిగిస్తే అది,
మరెన్నింటినో ఉద్దీపనం చేస్తుంది.
యువహృదయాల్లో ఈ ఆరని ఈ దివిటీ,
దిక్సూచిగా వారికి మార్గదర్శనం చేస్తూ, 
‘దివ్యాగ్ని’ హృదయజ్యోతిగా జ్వలిస్తూ,
కాలాన్ని జయించిన ‘కలాం’ గా మారి,
చరిత్ర పుటల్లో చిరాయువయ్యింది.

'ఎస్కిమో'వతరణం

'ఎస్కిమో'వతరణం
------------------------
భావరాజు పద్మిని - 3.2.16


కరకరకర చలి ఎముకలు కొరకగ
గజగజ గజగజ తనువులువణుకగ
బిరబిరబిరబిర పరుగులు తీయుచు
చకచచకచక తొడుగుల దూరుచు
వడివడిగ జడియె రదియె కనుము
అభినవ 'ఎస్కిమో'వతరణం.



టకటకటకటక నడుములు పట్టెను
సరసర గాలికి నరములు వాచెను
జరజర నీరే తగిలిన కాల్చెను
చలిపులి దాడికి తపనలు హెచ్చెను
ఉష్ణపు పెట్టెకై తృష్ణయు రేగెను

అజగరముల వలె కదలక నుండుచు
అరగని తిండితొ ఇరుకున పడియుచు
దొరికిన బట్టల నన్నియు కప్పుచు
చరచరచరచర ముసుగులు తన్నుచు
గడబిడ పాట్లవి గండము తీరుగ

దొరలను సైతము దొంగల జేయుచు
ముసుగుల మాటున ముఖములు దాచుచు
మండుటెండకై మనసులు రగిలెను
కాని కాలమున కడగండ్లు పడుచు
ఎస్కేపులేక ఎస్కిమోలే వేచెను.

( మనిషి స్ధబ్దంగా అదే భావనలో ఉండిపోతే ఎలా విసుగొస్తుందో, ఏ ఋతువైనా కొన్నాళ్ళకు బోర్ కొడుతుందేమో. చలికి తాళలేక రాసిన ఈ కవిత, చలికే అంకితం)

ఓ బొమ్మ ఆత్మకధ

ఓ బొమ్మ ఆత్మకధ 
---------------------------
భావరాజు పద్మిని- 13.2.16


నేనొక బొమ్మనే...
జీవం లేని దారాల ముద్దనే...
కానీ, నాకే మాటలొస్తే,
నా కధను చెబుతాను వింటారా?

ఏవేవో దూది పింజలు వడికి
మెత్తని తోలులో కూరి, కుట్టి,
గాజు కళ్ళు, ముక్కు అతికి,
గొలుసులతో ముస్తాబు చేసి,
నన్నేదో అంగడి గదికి పంపారు.

ఒక పాప పిలిస్తే తెలిసింది ...
నన్ను టెడ్డీ బేర్ అంటారట.
మరి నాకంటే ముద్దుగా ఉన్న
పాపేమో పింకీ అట.
తనంత ఎత్తున్న నన్ను,
కొనేదాకా మారం చేసింది.
నాకూ సంతోషమేగా...
నాకో అమ్మ దొరికింది.
బొమ్మకు పాపే అమ్మ కదా!



చాలా బొమ్మలు ఉన్నాయక్కడ,
వాటిలో నేనూ ఒక మూలన.
ఎప్పుడో ఆడేందుకు తీసినా, 
వేరే బొమ్మలతో పోటీనే నాకు.
ఒకరోజు పాలగ్లాసు ఒలికింది,
నా పేరు డర్టీ బేర్ అయ్యింది.
అప్పటిదాకా నా అందాన్ని,
అందరికీ చూపి మురిసిన పాప,
నన్ను తాకడమే మానేసింది.

పాప పుట్టినరోజు వచ్చింది
కొత్త బొమ్మల కొండ మధ్య
నేనో దిష్టి బొమ్మనయ్యాను.
మర్నాడు ఓ బీద బాబుకు 
నన్ను కానుకగా ఇచ్చేసారు,
బాధగా పాపనొదిలి వెళ్ళాను.

అదొక చిన్న పూరిగుడిసె...
అదేవిటో, అసలు బొమ్మలే లేవక్కడ .
ఒక్కగానొక్క బొమ్మనని యెంత అపురూపమో !
స్నానం చేయించేసారు, మళ్ళీ మెరిసిపోసాగాను,
నన్ను చూసిన బాబు కళ్ళూ మెరిసాయి. 
బాబుకు నేనే లోకం ...
పాలు త్రాగే దగ్గరినుంచి, పడుకునే దాకా !
నాకూ పెట్టమంటూ నన్ను చూపేవాడు, 
రోజంతా నాతో మాట్లాడుతూ ఉండేవాడు, 
ఎక్కడికి వెళ్ళినా నన్నూ తీసుకువెళ్ళేవాడు, 
నామీద ఎక్కి కూర్చుని, గుర్రం ఆట ఆడేవాడు, 
నామీదే వాలిపోయి, నిద్రపోయేవాడు, 
మళ్ళీ లేవగానే, నాకోసమే వెతుక్కునేవాడు, 
మాసిపోడం, మళ్ళీ స్నానం చేయించడం...

నల్లబడిపోతున్నాను... 
కుట్లు ఊడిపోయి, దూది బైటికొస్తోంది 
అయినా నా అందంతో వాడికి పనిలేదు 
అవే ఆటలు, అదే ప్రేమ, అవే కబుర్లు. 
పింకీ మనసు మినరల్ వాటర్ అయితే,
మలినాలు ఎన్నున్నా అంటని,
గంగానది వంటిది బాబుమనసు.

నాకు తెలిసిపోతోంది...
నా ప్రాణాలు గాల్లో కలవబోతున్నాయి. 
నాలోని దూదంతా క్రమంగా ఎగిరిపోతోంది. 
కాని, నానుంచి విడివడే ప్రతి దూదిపింజ, 
బాబు ప్రేమతో తడిసినదే !
పుట్టిన ప్రతి ప్రాణి కోరుకునేది ప్రేమేనట !
కణకణమూ ప్రేమతో రాగరంజితమవడమే,
జన్మకు సార్ధకత అని అంటారట !నిజమేనా?
అయితే, నా జన్మా తరించినట్లేగా...
తృప్తిగా లోకానికి వీడ్కోలు పలుకుతూ,
చెత్త మంటల్లో చెత్తగా కాలిపోతూ...
బాబు జ్ఞాపకాలతో హాయిగా వెళ్ళిపోతున్నాను.

( అపురూపంగా చిన్నారులు చూసుకునే బొమ్మలకు ప్రేమతో అంకితం...)

3, జులై 2016, ఆదివారం

సాహితీ యుగకర్త

సాహితీ యుగకర్త
---------------------------
భావరాజు పద్మిని - 7/4/2016

కవే కదా అనుకున్నాను.
కానీ...
తెలుగు కవనవన మరందాలను
కోట్లాది మనసులకు పంచిన
నవకావ్య చక్రవర్తి అనుకోలేదు.

పాటలే రాస్తారనుకున్నాను.
కానీ...
మేటి మాటల మూటల్ని
తెలుగునాట నిక్షిప్తం చేసిన
తరగని గని అనుకోలేదు.

భక్తుడేమో అనుకున్నాను.
కానీ...
భారమైన బ్రతుకుల్ని చదివిన
భవబంధాల పసేవిటో తెలిసిన
యోగిపుంగవుడని అనుకోలేదు.

మార్గదర్శి అనుకున్నాను.
కాని...
గాయమైన గుండెల వేదనను
గేయాల పూతతో నివారించే
దార్శనికుడని అనుకోలేదు.


'సిరి వెన్నెలే' కదా, అనుకున్నాను.
కాని...
ఆ వెన్నెల చలువతోనే కవనాల
కలువ అక్షరాలు విరబూయించిన
మహిమాన్వితుడని అనుకోలేదు.

వ్యక్తే కదా అనుకున్నాను.
కాని...
కేవలం అక్షరాల మాయాగారడీతో
ధైర్యం నూరిపోసి కదనుతొక్కించే
మహాదివ్య శక్తివంతుడనుకోలేదు.




ఇప్పుడెందుకో నాకు కళ్ళముందు
ఆ మహనీయుడి విరాట్ స్వరూపం
సమున్నతమైన శిఖరంలా గోచరిస్తోంది.
అరుగో...
ఆ సాహితీ యుగకర్త చుట్టూరా
ఆయన అక్షరాల అస్త్రాలుధరించి,
భక్తితో నమస్కరించే ఏకలవ్యశిష్యులు...
సాహితీ శరసంధానానికి సిద్ధంగా ఉన్నారు.

అడుగడుగునా కలాలు పట్టుకుని,
సుతారంగా మనసుల్ని స్ప్రుశించేందుకు,
సద్భావాలను భవితకు పంచేందుకు,
సమాజ జాడ్యాల్ని సవాలు చేసేందుకు,
అన్యాయాలను చీల్చి చండాడేందుకు,
అక్రమాలను నిగ్గదీసి ప్రశ్నించేందుకు,
మొక్కవోని ధైర్యంతో ముందుకురికే,
వేవేల సాహితీసేన కనిపిస్తున్నారు.

గీతాచార్యుడి కంటే గొప్ప కాదూ...
ఈ సాహితీ భగవద్గీతాచార్యుడు!
అజ్ఞాతంగానే అక్షరోపదేశం చేసి,
తెలుగింటి మనసులెన్నో చెక్కి,
తన ప్రతిబింబాల్ని రూపుదీర్చి,
సాహితీ సమరాంగణం కోసమై,
సర్వత్రా సన్నద్ధం చేసారు.

అందుకే ఈ సాహితీ యుగకర్త,
అక్షరం ఉన్నంత వరకూ...
వేవేల మానససరోవరాల్లో మెరిసే,
'సిరివెన్నెల' పున్నమి చంద్రుడే !

(కొందరి అక్షరాలు చూస్తే, సిరివెన్నెల గారి ఛాయలు కనిపిస్తాయి. అదేవిటో వాళ్ళను అదే సంగతి అడిగితే, 'నేను సిరివెన్నెల గారి వీరాభిమానిని, ఏకలవ్య శిష్యుడ్ని' అంటారు. నేనూ అంతే, ఒక్కో మాటని పాటలో ఎలా రాయచ్చో, విని, నేర్చుకుంటూ ఉంటాను. ఒక్క కృష్ణుడు వేవేల అర్జునులకు గీతోపదేశం చేసినట్టు, సిరివెన్నెల గారు అక్షరోపదేశం చేసారా అనిపిస్తుంది. మౌనంగానే వారు చేసిన ఈ మాయాజాలం తెలుగింట అక్షరాన్ని సుసంపన్నం చేసింది... చిరంజీవిని చేసింది. అందుకే, భక్తితో వారికీ కవితా కానుక.)